Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 12:36 pm Posted by : Anjaneyulu Dega

స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి.. ప్రజా భవన్ ముట్టడించిన USFI

విద్యార్థి నాయకుల అరెస్టు.. నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలింపు
ముందస్తు అరెస్టులను ఖండించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిట్టపల్లి తిరుపతి

హైదరాబాద్ జులై 10, ( ఆంజనేయులు న్యూస్ )

పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని, ఖాళీగా ఉన్న డీఈవో (DEO), ఎంఈవో (MEO) పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ USFI ఆధ్వర్యంలో శుక్రవారం “ఛలో ప్రజా భవన్” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ప్రజా భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించిన విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా USFI తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిట్టపల్లి తిరుపతి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలా కాలం గడిచినా విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇప్పటికీ విడుదల కాకపోవడం దురదృష్టకరమన్నారు. దీంతో వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే పెండింగ్ నిధులను విడుదల చేయడంతో పాటు విద్యారంగ సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్వహించిన శాంతియుత కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అలాగే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా USFI నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని కూడా ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, విద్యార్థుల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు USFI ఆధ్వర్యంలో ఉద్యమాలు, పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరించారు.