Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 9:52 pm Posted by : Anjaneyulu Dega

విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలి

పాఠశాలల తనిఖీలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్”

“నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలపై కలెక్టర్ ఆదేశాలు”

మంచిర్యాల జూలై 8, ( ఆంజనేయులు న్యూస్ )

ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని జన్నారం మండలం అక్కపల్లిగూడ గ్రామంలోని మండల పరిషత్ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాలను జన్నారం మండల తహసిల్దార్ బక్కయ్య, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఉమర్ షరీఫ్ లతో కలిసి సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న బోధనా తీరు, రిజిస్టర్లు, వంటశాల, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పొనకల్ గ్రామంలోని భవిత వనరుల కేంద్రం, మండల పరిషత్ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల సంఖ్య పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి కొనసాగుతున్న అదనపు గదులు, మూత్రశాలలు, భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి వంటశాల, ప్రహరీ గోడ నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కవ్వాల్ గ్రామంలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి తరగతి గదులు, పరిసరాలు పరిశీలించి విద్యార్థుల సంఖ్య పెంపొందించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఓ.పి. రిజిస్టర్, వార్డులు, మందుల నిల్వలు, పరిసరాలు పరిశీలించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణీలు, ప్రజల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని తెలిపారు. తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి, ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుపై సమీక్షించారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ నెల 24వ తేదీ లోగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగవంతం చేసి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులకు మంజూరైన ఇండ్లు నిర్మాణం త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం దండేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలు, ఓ.పి. సేవలు, ప్రతిరోజు ఆసుపత్రికి వస్తున్న ప్రజల వివరాలను పరిశీలించారు. గర్భిణులు ఆసుపత్రులలోనే ప్రసవాలు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రైవేట్ ఆసుపత్రులలో జరుగుతున్న ప్రసవాల వివరాలను సేకరించి పోర్టల్ లో నమోదు చేయాలని వైద్యాధికారులకు సూచించారు. వర్షాకాలం అయినందున అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, నీటిని కాచి చల్లార్చి వడపోసి తాగే విధంగా ప్రజలకు సూచించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చే ప్రజలలో వ్యాప్తి చెందుతున్న వ్యాధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.