– విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలి
– మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

( మంచిర్యాల, జూలై 7, ఆంజనేయులు న్యూస్ )
ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని వేమనపల్లి మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి పాఠశాలలో కొనసాగుతున్న అదనపు తరగతి గదుల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తూ విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలో పాఠశాలలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, భోజనశాల నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని తెలిపారు. తరగతి గదులు, వసతి గదులు, వంటశాల, పరిసరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం, శుద్ధమైన త్రాగునీరు అందించాలని, వర్షాకాలం దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాలలో సకల సదుపాయాలు కల్పించడం జరిగిందని, విద్యార్థుల సంఖ్య పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండలంలోని గొలపల్లి గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. బూత్ స్థాయి అధికారుల ద్వారా ప్రజలకు ఎన్యుమరేషన్ ఫారాలు అందించడం జరిగిందని, ఫారాలు పూరించిన తర్వాత బూత్ స్థాయి అధికారులు సేకరించి వాటిలోని సమాచారాన్ని బిఎల్ఓ యాప్ లో డిజిటలైజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు అందించిన ఎన్యుమరేషన్ ఫారాలను సరైన సమాచారంతో నింపడంలో బూత్ స్థాయి ఏజెంట్లు, వాలంటీర్లు ప్రజలకు సహకరించి, స్పష్టమైన సమాచారాన్ని పొందుపరిచేలా కృషి చేయాలని తెలిపారు. ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఉన్నందున ఓటరు వివరాలను నింపిన ఎన్యుమరేషన్ ఫారాలను అందించని పక్షంలో ఓటు కోల్పోయే అవకాశం ఉందని, బూత్ స్థాయి ఏజెంట్లు, వాలంటీర్లు, యువత ఫారం పూరింపులో ప్రజలకు సహకరించాలని తెలిపారు. సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా 2002 సంవత్సరంలో ఓటు హక్కు కలిగిన వారి కుటుంబ సభ్యులను అనుసంధానం చేస్తూ ప్రస్తుత సవరణ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని, డబుల్, షిఫ్టెడ్, డెత్ ఓటర్ల తొలగింపు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. అనంతరం మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బంది హాజరు, భూభారతి రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తుల పెండెన్సీ పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూభారతి దరఖాస్తులను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయి పరిశీలన చేసి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వివిధ ధ్రువపత్రాల కొరకు అందిన దరఖాస్తులను నిబంధనలకు లోబడి పరిశీలించి నిర్ణీత గడువులోగా జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తదనంతరం చెన్నూర్ పట్టణంలో కొనసాగుతున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణ పనులను సందర్శించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సాయికృష్ణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కుమారస్వామి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.