Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 9:04 pm Posted by : Anjaneyulu Dega

మంచిర్యాల గ్రీన్ సిటీలో అక్రమ షెడ్ల దందా..!

రోడ్లనే ఆక్రమిస్తున్న ఇంటి యజమానులు

పట్టించుకునేవారు లేరు.. మౌనంగా మున్సిపల్ యంత్రాంగం

టౌన్ ప్లానింగ్ అధికారులపై స్థానికుల ఆగ్రహం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలోని గ్రీన్ సిటీ కాలనీ అక్రమ షెడ్లకు అడ్డాగా మారింది. కార్ పార్కింగ్ పేరుతో కొంతమంది ఇంటి యజమానులు రోడ్లపైనే ఇనుప షెడ్లు నిర్మిస్తూ ప్రభుత్వ స్థలాలను బహిరంగంగా ఆక్రమిస్తున్నారు. కాలనీలో ఎక్కడ చూసినా రోడ్లపై షెడ్లు, ఆక్రమణలే కనిపిస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. అనుమతులు లేకుండానే భారీ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ మున్సిపల్ యంత్రాంగం, టౌన్ ప్లానింగ్ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు మౌనం వహించడంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు కుచించుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ వెళ్లలేని పరిస్థితి నెలకొంటోందని స్థానికులు చెబుతున్నారు. “సాధారణ ప్రజలు చిన్న నిర్మాణం చేసినా నోటీసులు ఇచ్చే అధికారులు.. ఇలాంటి బహిరంగ ఆక్రమణలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?” అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ యంత్రాంగం అధికారులు స్పందించి గ్రీన్ సిటీలో కొనసాగుతున్న అక్రమ షెడ్ల నిర్మాణాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రోడ్ల ఆక్రమణలను తొలగించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.