Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 2:45 pm Posted by : Anjaneyulu Dega

మంచిర్యాల బైపాస్‌లో చెత్త దహనం కలకలం

• మంటల నుంచి వ్యాపిస్తున్న పొగతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

•  “ఇది ఏమన్నా డంపింగ్ యార్డా?” అంటూ స్థానికుల ఆగ్రహం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డుపై తెలంగాణ అమరవీరుల స్థూపం సమీపంలో చెత్త దహనం జరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని పలు కాలనీల నుంచి సేకరించిన చెత్తను రాళ్లవాగు పరివాహక ప్రాంతంలో పారవేస్తుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల ఆరోపణల ప్రకారం, అక్కడ పేరుకుపోయిన చెత్తను ఉదయం, సాయంత్రం వేళల్లో కాల్చడం వల్ల భారీగా పొగ వ్యాపిస్తోంది. దీంతో పరిసర ప్రాంతాలు పొగతో కమ్ముకుపోయి ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. కళ్ల మంటలు, దుర్వాసన వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వారు వాపోతున్నారు. బైపాస్ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు కూడా పొగ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ అమరవీరుల స్థూపం పరిసర ప్రాంతాల్లో పొగ మరింతగా వ్యాపిస్తుండటంతో స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. “ఇది ఏమన్నా డంపింగ్ యార్డా?” అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు, వెంటనే సంబంధిత అధికారులు స్పందించి చెత్త పారవేత, చెత్త దహనాన్ని అరికట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.