Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 9:55 am Posted by : Anjaneyulu Dega

మంచిర్యాల ఐబీ చౌరస్తాలో గుంతతో పొంచి ఉన్న ప్రమాదం

గతంలో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు.. అయినా పట్టించుకోని అధికారులు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలోని రద్దీ ప్రాంతమైన ఐబీ చౌరస్తాలో రోడ్డుమధ్య ఏర్పడిన గుంతలు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ చౌరస్తాలో గుంతలు ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటికీ శాశ్వత చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంతలు స్పష్టంగా కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో గుంతలను తప్పించుకునే క్రమంలో వాహనాలు అదుపుతప్పే పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రమాదం జరిగితే గాని అధికారులు స్పందించరా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఐబీ చౌరస్తాలో ఉన్న గుంతలను వెంటనే పూడ్చి వాహనదారుల ప్రాణాలను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.