Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 2:58 pm Posted by : Anjaneyulu Dega

కాగజ్‌నగర్‌ క్రాస్ రోడ్ వద్ద కూల్‌డ్రింక్స్ దోపిడీ..! ఎంఆర్పీపై రూ.5 అదనపు వసూళ్లు

• వేసవి దాహం తీర్చుకోవడానికి వచ్చిన పేదలపై భారం

• అధికారుల జోక్యం కోరుతున్న ప్రజలు

ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ క్రాస్ రోడ్ వద్ద కూల్‌డ్రింక్స్‌పై ఎంఆర్పీ (MRP) కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి బాటిల్‌పై సుమారు రూ.5 వరకు అదనంగా తీసుకుంటున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఇదే విధంగా కాగజ్‌నగర్ పరిసర గ్రామాలలోని పలు కిరాణా దుకాణాలలో కూడా ఎంఆర్పీపై అదనపు వసూళ్లు జరుగుతున్నాయని గ్రామీణులు వాపోతున్నారు. వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో పరిసర ప్రాంతాల నుంచి వచ్చే పేద ప్రజలు, కూలీలు, ప్రయాణికులు దాహం తీర్చుకోవడానికి ఈ ప్రాంతానికి వస్తుండగా, ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొంతమంది వ్యాపారులు అధిక ధరలు వసూలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలు వసూలు చేయడం వినియోగదారుల హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా పోలీసులు, మున్సిపల్ అధికారులు, సరఫరా శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి, అధిక ధరలు వసూలు చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టి, వినియోగదారులను దోపిడీ నుంచి రక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.