సకాలంలో నిర్ధారణ – సరైన చికిత్సే క్యాన్సర్ నివారణకు కీలకం
డాక్టర్. తులా సందీప్ కుమార్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: క్యాన్సర్ను ప్రథమ దశలోనే గుర్తించడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని యశోద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ తులా సందీప్ కుమార్ తెలిపారు. గురువారం మంచిర్యాల పట్టణంలోని నార్తిన్ హోటల్ లో మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా డాక్టర్. సందీప్ మాట్లాడుతూ. ఆధునిక వైద్య సాంకేతికత అందుబాటులో ఉన్న నేపథ్యంలో క్యాన్సర్ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా కాలేయం (లివర్), పిత్తాశయం (గాల్బ్లాడర్), నోటి క్యాన్సర్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. “హైపర్ సైట్” వంటి ఆధునిక నిర్ధారణ పద్ధతుల ద్వారా క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించి వెంటనే చికిత్స ప్రారంభించవచ్చని వివరించారు. ఏవైనా అనారోగ్య లక్షణాలు రెండు వారాలకు మించి కొనసాగితే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి అని ఆయన స్పష్టం చేశారు. తొలిదశలో గుర్తిస్తే చికిత్స సులభమవడంతో పాటు రోగి కోలుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పారు. అయితే నిర్లక్ష్యం వహిస్తే వ్యాధి ముదిరి ప్రాణాపాయ స్థితికి చేరే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం ఆధునిక వైద్య సదుపాయాలు విస్తృతంగా అందుబాటులో ఉన్నందున ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత జాగ్రత్త వహించాలని ఆయన పేర్కొన్నారు.