Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 08 April 2026, 9:04 pm Posted by : Anjaneyulu Dega

మంచిర్యాల మార్కెట్‌లో మళ్లీ ఆక్రమణలు

ఎమ్మెల్యే హెచ్చరికలకూ లెక్కచేయని బట్టల షాప్ యజమాని

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని ప్రధాన మార్కెట్‌లో రోడ్డు ఆక్రమణలు మళ్లీ తెరపైకి వచ్చాయి. రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో షాపులు ముందుకు రాకూడదని ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ, కొందరు వ్యాపారులు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేకంగా మార్కెట్ లోని తులసి బట్టల దుకాణం యజమాని తన షాప్ ముందు రోడ్డుపై పూల స్టాల్ ఏర్పాటు చేయించి, నెలనెలా అద్దె వసూలు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ కారణంగా రోడ్డుపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతూ, వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికుల ప్రకారం, ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డు విస్తరణ పనుల పేరుతో సాధారణ ప్రజల షాపులను తొలగిస్తూనే, ఇలాంటి ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ఆరోపిస్తున్నారు..

• వాహనదారుల డిమాండ్:

ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డుపై ఏర్పాటు చేసిన పూల స్టాల్‌ను తక్షణమే తొలగించి, నిబంధనలు ఉల్లంఘించిన తులసి బట్టల షాప్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.