సోషల్ మీడియాలో అపోహలు సృష్టిస్తే కఠిన చర్యలు
హెచ్చరిక జారీ చేసిన ఎఎస్పీ సాయికిరణ్

ఆంజనేయులు న్యూస్, నిర్మల్ జిల్లా: జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద ఘటనను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎఎస్పీ సాయికిరణ్ ఐపీఎస్ హెచ్చరించారు. మొన్న ఒక కార్ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపిన వాహనం ఒక వ్యక్తిని ఢీకొనడంతో అతని కాలికి గాయం అయింది. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మరో వ్యక్తి కారులో ఉన్న వారిపై ఆగ్రహంతో వాగ్వాదానికి దిగాడు. “చూసుకుని వెళ్లాలి కదా” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అనంతరం కారును డ్యామేజ్ చేసిన ఘటన చోటుచేసుకుంది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ఇరుపక్షాలపై వేర్వేరు కేసులు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్పై ఒక కేసు, కారుపై దౌర్జన్యం చేసి నష్టం కలిగించిన వ్యక్తిపై మరో కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. అయితే, ఈ సాధారణ రోడ్డు ప్రమాదాన్ని రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందని పోలీసుల దృష్టికి వచ్చినట్లు ఎఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు నిర్ధారించని సమాచారాన్ని నమ్మకూడదని, షేర్ చేయకూడదని విజ్ఞప్తి చేశారు. అపోహలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు శాఖ స్పష్టం చేసింది.