జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 15, 16వ తేదీల్లో మంచిర్యాల జిల్లాలోని వేలాల జాతర వద్ద ప్రభుత్వం 108 అంబులెన్స్ సేవలు మరియు ప్రత్యేక వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేలల జాతరకు తరలివచ్చే భక్తులకు 108 అంబులెన్స్ సేవలు 24 గంటల పాటు నిరంతరంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. పుణ్యక్షేత్రం వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, అక్కడ వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది, అత్యవసర మందులను సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. భక్తులకు ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే తక్షణమే చికిత్స అందించి, అవసరమైతే సమీపంలోని పెద్ద ఆసుపత్రులకు తరలించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులు ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కోరారు.