జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత బుధవారం మంచిర్యాల గోదావరి ఘాట్లోని సమ్మక్క–సారలమ్మ జాతర ప్రాంగణాన్ని సందర్శించి, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన 24 గంటల వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు వైద్య ఆరోగ్యశాఖ తరఫున అన్ని రకాల వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జాతర సమయంలో వైద్యులు, ఆర్బీఎస్కే సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, 108 అంబులెన్స్ సేవలు అత్యవసర పరిస్థితుల్లో నిరంతరం సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ ద్వారా జాతరలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా భక్తులు పరిశుభ్రమైన మంచినీటిని మాత్రమే వినియోగించుకోవాలని, తినే ఆహార పదార్థాలపై దుమ్ము, ఈగలు వాలకుండా కప్పి ఉంచుకోవాలని సూచించారు. అలాగే బయట మల విసర్జన చేయకుండా పరిశుభ్రత పాటించాలని కోరారు.
చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అస్వస్థతకు గురైన వెంటనే సమీప వైద్య శిబిరాన్ని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిహెచ్ఎన్ ఆర్.ఎస్. పద్మ, మార్తా వైద్యులు, వైద్య సిబ్బంది, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ తదితరులు పాల్గొని జాతరలో భక్తులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.