Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 24 January 2026, 10:31 pm Posted by : Anjaneyulu Dega

వ్యవసాయ పరికరాలతో రైతులకు సాగు సులభతరం

మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వ్యవసాయ సాగులో రైతులకు ఉపయోగకరమైన వ్యవసాయ పరికరాలతో సాగు సులభతరం అవుతుందని మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గల పద్మనాయక ఫంక్షన్ హాల్ లో జిల్లా వ్యవసాయ అధికారిని సురేఖ, మంచిర్యాల ఏ ఎం సి చైర్మన్ పయ్యావుల పద్మ ముని, ఆత్మ బి ఎఫ్ ఏ సి ఛైర్మన్ సింగటి మురళి, సహాయ వ్యవసాయ సంచాలకులు మంచిర్యాల డివిజన్ ఎం.కృష్ణ లతో కలిసి అర్హులైన రైతులకు వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల శాసనసభ్యులు మాట్లాడుతూ 2025-26 సంవత్సరానికి గాను సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజెషన్ లో భాగంగా ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రాయితీపై రైతులకు వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని, రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా పథకాలను అమలు చేయడంతో పాటు వరి ధాన్యం, పత్తి, మొక్కజొన్న పంటలను కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి కొనుగోలు చేస్తూ రైతుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో 35 లక్షల 31 వేల రూపాయల విలువైన 6 పవర్ టిల్లర్లు, 6 రోటవేటర్లు, 52 పవర్ స్ప్రేయర్లు, 16 బ్రష్ కట్టర్లను జిల్లాలోని దండేపల్లి, హాజీపూర్, లక్షెట్టిపేట మండలాలకు చెందిన 81 మంది అర్హులైన రైతులకు 16లక్షల 24 వేల రూపాయల రాయితీతో పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.