
ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: తెలంగాణలోని వివిధ చోట్ల పలువురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఎంపీడీవో కార్యాలయంలో రూ. లక్ష లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా నందిగామ ఎంపీడీవో సుమతి, ఏపీవో తేజ్ సింగ్, ఈదులపల్లి కార్యదర్శి చెన్నయ్యను ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ అరెస్ట్ చేశారు. నందిగామ మండల పరిధిలోని ఈదులపల్లి గ్రామంలో బొబ్బిలి ప్రవీణ్ చేపట్టిన భవన నిర్మాణానికి రూ.3.5 లక్షలు లంచం ఇవ్వాలని అధికారులు డిమాం చేశారు. గతంలో రూ. లక్ష ఇచ్చిన ప్రవీణ్.. ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. బుధవారం మరో రూ. లక్ష లంచం తీసుకుంటుండగా ముగ్గురినీ ఏసీబీ డీఎస్పీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
• రూ.50వేలు తీసుకుంటూ చిక్కిన దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్
హైదరాబాద్ లోని బాగ్ అంబర్పేటలోని దేవాదాయ శాఖకు చెందిన భూమి సర్వే రిపోర్టు ఇచ్చేందుకు ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ అక్కవరపు కిరణ్ కుమార్ ర 1.50లక్షలు లంచం డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్ లోని ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో రూ.50వేలు లంచం తీసుకుంటుండగా కిరణ్ కుమార్ ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.