Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 04 November 2025, 7:17 pm Posted by : Anjaneyulu Dega

ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి

మంచిర్యాల డిసిపి భాస్కర్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మంచిర్యాల డిసిపి ఎగ్గిడి భాస్కర్ అన్నారు.. లక్షెట్టిపేట పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీనివాస గార్డెన్స్ లో మంగళవారం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమానికి డిసిపి భాస్కర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ.. పోలీసులు పనిచేస్తున్నది ప్రజల రక్షణ కోసమేనని అన్నారు. నిత్యం మన ప్రాంతాల్లో వాహనాలపై వెళ్తున్న వారు వివిధ ప్రమాదాలకు గురై చనిపోతున్నారని అలా వాళ్లు చనిపోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. ఇట్టి ప్రమాదాలకు కారణాలు కేవలం మనం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమే అన్న విషయం మనం ప్రతి ఒక్కరం గుర్తుంచుకోవాలని మనమే కాకుండా మన వాళ్లకు కూడా ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన పెంచాలని అన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని పోలీసులు ప్రజల రక్షణ కోసం ప్రజల కుటుంబాల సంతోషం ఉండాలని ఎన్నో విధాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కొన్ని ప్రమాదాల్లో గాయపడ్డ వాళ్లని చనిపోయిన వాళ్ళని చూస్తే మనసు చలించిపోతుందని అలాంటి ప్రమాదాలకు నిర్లక్ష్యం మనం రూల్స్ పాటించకపోవడమే అని అన్నారు.

ఇప్పటికైనా ప్రతి ఒక్క డ్రైవర్ గాని ప్రతి ఒక్క వాహనదారుడు గాని తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. బైక్ నడిపే సమయంలో తప్పకుండా హెల్మెట్ ధరించాలని కారు నడిపే సమయంలో సీట్ బెల్ట్ ధరించాలని స్కూల్ పిల్లలను జాగ్రత్తగా డ్రైవర్లు తీసుకువెళ్లాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని రాష్ డ్రైవింగ్ నేరంగా భావించాలని అవగాహన కల్పించారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు వాహన పత్రాలను సరిచూసుకోవాలని డ్రైవింగ్ లైసెన్స్ లేనిదే వాహనం నడపరాదన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని వాహనదారులతో డ్రైవర్లతో ప్రమాణం చేయించారు. అనంతరం కొంతమందికి హెల్మెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసిపి ప్రకాష్, లక్షేటిపేట సిఐ రమణమూర్తి, లక్షెట్టిపేట ఎస్సై గోపతి సురేష్, దండేపల్లి ఎస్సై తహసినోద్దీన్, జన్నారం ఎస్సై అనూష తో పాటు పోలీస్ సిబ్బంది, రవాణా శాఖ అధికారులు, వాహనదారులు, డ్రైవర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.