Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 28 August 2025, 4:51 pm Posted by : Anjaneyulu Dega

వరద పరిస్థితుల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి.

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వర్షపాతం కారణంగా వరద పరిస్థితుల దృష్ట్యా అధికార యంత్రాంగం ప్రజా సంరక్షణలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని మంచిర్యాల పట్టణంలో గల గోదావరి నది తీరం, మాతా శిశు ఆసుపత్రి పరిసరాలను ఆర్.ఐ. శిరీషతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు నేపథ్యలో వరద పరిస్థితులు ఏర్పడనున్న దృష్ట్యా ప్రజల రక్షణ కొరకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరుగుతున్నందున ప్రజలు ఎవరు అటువైపుగా వెళ్లకుండా బందోబస్తు చర్యలు చేపట్టాలని, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తక్షణ సహాయం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ నంబర్ 08736- 250501 ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉంటున్నామని, అత్యవసర సేవల నిమిత్తం పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఆసుపత్రికి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగిందని, వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాలని తెలిపారు. అనంతరం హాజీపూర్ మండలం పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును మండల తహసిల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే తో కలిసి సందర్శించి ప్రాజెక్టులోకి చేరుతున్న వరద నీటి వివరాలను ఎల్లంపల్లి డి.ఈ., ఎ.ఈ. లను అడిగి తెలుసుకున్నారు. వరద నీటి ఇన్ ఫ్లో అధికంగా ఉన్నందున అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని తెలిపారు. అత్యవసర చర్యల కొరకు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, వర్షపు నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగిస్తూ దోమల వృద్ధిని అరికట్టేందుకు ఆయిల్ బాల్స్, దోమల మందు పిచికారి చేయాలని తెలిపారు. ముల్కల్ల లోని గోదావరి నది తీరాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాలలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..