Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 23 August 2025, 10:35 pm Posted by : Anjaneyulu Dega

పిల్లల చేతికి ఫోన్ ఇస్తున్నారా..? జర భ్రదం

డాక్టర్ సునీల్ మానసిక వైద్య నిపుణులు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: స్మార్ట్ ఫోన్.. ఎన్ని అద్భుతాలు చేస్తోందో తెలుసు కదా.. ! ప్రస్తుతం అది లేనిదే రోజు గడవట్లేదు ఎవరికి. పెద్దల వరకైతే పర్లేదు కానీ.. చివరికి చిన్న పిల్లలు కూడా అడిక్ట్ అయిపోతుండటమే ఇక్కడ సమస్య అని మానసిక వైద్యనిపుణులు డాక్టర్ సునీల్ అంటున్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ స్మార్ట్ ఫోన్ వాడడంవల్ల ఆరోగ్యంపై, చదువులపై, ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఇటీవలి అధ్యయనాలు కూడా అదే పేర్కొంటున్నాయి. ముఖ్యంగా పిల్లల ప్రవర్తనలో మార్పులకు కారణం అవుతోందని ‘గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్ సర్వే’ కూడా పేర్కొన్నది. కొన్నేళ్లుగా యువత, చిన్నారులు చరవాణులకు బానిసవుతున్నారు. పిల్లలు మారం చేస్తున్నారని తల్లిదండ్రులు చరవాణులు చూపిస్తూ లాలిస్తున్నారు. వాటిలో వచ్చే లఘు చిత్రాలు, సందేశాలకు పసితనంలోనే ఆకర్షితులై బానిసవుతున్నారు. కొందరు బడిఈడు పిల్లలను గతంలో కరోనా సమయంలో వచ్చిన ఆన్లైన్ తరగతులు ఫోన్లకు కట్టేశాయి. ఇప్పుడు ప్రాజెక్టు వర్క్ పేరిట వివిధ అంశాల శోధనకు ఫోన్ వాడుతున్నారు. కాగా తమ పిల్లలు ఫోన్ తో ఏం చేస్తున్నారని గమనించకపోవడంతో దాన్ని విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వాటిలో పబ్జీ, ఫ్రీఫైర్ ఆటలు ఎదుటి వారిని ఓడించడంలో వచ్చే పాయింట్ల వేటలో పొందే ఆనందంలో లోకాన్ని మరిచిపోతున్నారు.

• ప్రాణాలమీదకు తెచ్చిన సంఘటనలు:

తాజాగా భైంసా పట్టణంలో అగ్నిమాపకం కేంద్రం సమీపంలో నివాసముంటున్న హైదరాబాద్ కు చెందిన సంతోష్, సాయిసుప్రజ దంపతుల కుమారుడు రిషేంద్ర(13) పబ్జీ ఆటకు బానిసై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లో ఒంటరిగా ఆకలి, నిద్ర మరిచి గంటల తరబడి ఆటలో నిమగ్నమైపోవడంతో మానసిక స్థితిపై ప్రభావం పడింది. తల్లిదండ్రులు వైద్యనిపుణుల వద్దకు తీసుకెళ్లినా ఫలితం కానరాలేదు. మూడ్రోజుల నుంచి కుటుంబీకులు వారించగా జీవితంపై విరక్తి చెంది క్షణికావేశంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గతంలో కూడా ఎంతోమంది ఆటలు ఆడుతూ పెట్టుబడులు పెడుతూ. రూ. లక్షల్లో కోల్పోయి. దీంతో చేసేదేమి లేక, ఎవరికి చెప్పుకోలేక మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న వారే ఎక్కువగా ఉన్నారు..

• పెద్దలు గమనించాలి:

చిన్నారులు, యువత చరవాణులు వినియోగిస్తున్నప్పుడు పెద్దలు గమనిస్తుండాలని మానసిక వైద్యనిపుణులు డాక్టర్ సునీల్ సూచిస్తున్నారు.

• పాఠశాలలో ఇచ్చే ప్రాజెక్టు పనుల సాకుతో వాడుతున్న ఫోన్లను పిల్లలు ఎలా వినియోగిస్తున్నారో గమనించాలి.

• ఫోన్ల వినియోగంతో ఎదురయ్యే దుష్ప్రభావాలను తెలియజేయాలి.

• చరవాణి వినియోగిస్తున్న పిల్లలు సరిగా తినరు. నిద్రపోరు. చిన్న మాటలకు కుంగిపోతుంటారు. ఒత్తిడికి లోనవుతుంటే ఓ కంట కనిపెట్టాలి. అలాంటి లక్షణాలు ఉంటే మానసిక వైద్యులను సంప్రదించాలి.

• సముదాయించి నచ్చజెప్పండి:

చరవాణుల్లో వచ్చే ఆటలు, రీల్స్, ఇతర కొన్ని లింకులు చిన్నారులను ఆకర్షిస్తున్నాయి. ఆ ఆనందంలో లోకాన్ని మరిచిపోయి బానిసవుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు బెదిరించినప్పుడు మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలా చేయకుండా ముందే వారిని ప్రేమతో మన దారిలోకి తెచ్చుకొని సముదాయించాలి అని తెలిపారు..