Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 24 May 2025, 11:41 pm Posted by : Anjaneyulu Dega

ఇచ్చోడలో జోరుగా చూచిరాతలు.

పర్యవేక్షణ పూజ్యం.. పరీక్షలు ఇష్టారాజ్యం

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: ఎక్కడైనా పట్టణాల్లో చదవడాన్ని చాలామంది ఇష్టపడతారు. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఇతర ప్రాంతాల నుంచి ఇచ్చోడకు వచ్చి డిగ్రీ చదువుతున్నారు. చదువు బాగా చెబుతారని కాదు. సులువుగా పాస్ కావాలంటే ఇక్కడ డిగ్రీలో చేరితే సరిపోతుందని భావిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన కళాశాలల యాజమాన్యాలు.. కాసుల వేటలో పడి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఉచితాలు, పాస్ పక్కా అంటూ వారిని చేర్చుకుంటూ జోరుగా చూచిరాతలను ప్రోత్సహిస్తున్నాయి. ఇటీవల ప్రారంభమైన డిగ్రీ ఏ సెమిస్టర్ పరీక్షల్లో జోరుగా కాపీయింగ్ సాగడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఇచ్చోడ కేంద్రంలో విద్యార్థులు ప్రవేశం పొందుతున్నారు. ఇప్పటికే ఇక్కడ 5 డిగ్రీ కళాశాలలు ఉండగా, అందులో ఒకటి ప్రభుత్వ కళాశాల  విద్యార్థులకు మాయమాటలు చెప్పి కళాశాలల్లో చేర్పించడం, పరీక్షలకే రావాలని సూచించడంతో అటువైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. పరీక్షల్లోనూ మాస్ కాపీయింగ్ కు ప్రోత్సహించడంతో ఎలాగైనా పాస్ కావచ్చనే భరోసా విద్యార్థుల్లో నెలకొంది.

• వసతులు లేకున్నా..

కనీస వసతులు లేకుండా కళాశాలలను ఏర్పాటు చేయడం, సరైన అర్హతలులేని అధ్యాపకులను నియమించినా, పట్టుమని పది రోజులైనా కళాశాలలకు వెళ్లకుండా విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడం విస్మయానికి గురిచేస్తోంది. వీరు కనీస విద్యాసామర్థ్యం లేకపోవడంతో పోటీ పరీక్షల్లో రాణించే పరిస్థితి లేదు. గతంలో పర్యవేక్షకులపై దాడులు గతంలో ఇచ్చోడలో కాపీయింగు పాల్పడిన విద్యార్థులను డిబార్ చేయడంతో ఏకంగా ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది కారుపై రాళ్లు రువ్వారు. అప్పటి నుంచి డిబార్ల సంఖ్య తగ్గడం మరింత విస్మయానికి గురిచేస్తోంది.

• పాలకుల అండదండలు..

ప్రైవేటు యాజమాన్యాల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేసే పరిస్థితి లేదు. పాలకుల అండదండలు ఉండటంతో అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇచ్చోడలోని ఓ కళాశాల పక్కన పడేసిన చీటీల ను చుసామని స్థానికులు తెలిపారు. ఈ చీటీలు ఏకంగా కళాశాల పాలకుల అండదండలతో యాజమాన్యాలే విద్యార్థులకు వీటిని అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఆదిలాబాద్ లోనే అనేక కళాశాలలు ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు, అక్కడి విద్యార్థులు సైతం ఇచ్చోడలోనే ప్రవేశాలు పొందుతున్నారు. తమను ఉత్తీర్ణులను చేస్తారనే నమ్మకం ఉండటంతో వారి సంఖ్య పెరిగిపోతోంది.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ కళాశాలను పట్టించుకోని చూచిరాతలను కట్టడి చేయాలని కోరుకుంటున్నారు..