రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఎల్.ఆర్.ఎస్. –2020 పథకంలో భాగంగా లే-అవుట్ లేని భూముల క్రమబద్ధీకరణ కోసం అందిన దరఖాస్తులకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల నుండి రుసుము వసూలు ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి ఇతర ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులతో ఎల్.ఆర్.ఎస్. రుసుము వసూలు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ ఎల్.ఆర్.ఎస్. 2020 పథకంలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన లబ్ధిదారులు ఈ నెల 30వ తేదీ లోగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, రుసుము చెల్లించిన వారికి ప్రొసీడింగ్స్ అందజేయాలని తెలిపారు. ప్రక్రియ నిర్వహణలో ఏమైనా సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారులు రుసుము వసూలుపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలందరికీ తెలిసే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్.ఆర్.ఎస్.-2020 పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన లబ్దిదారుల నుండి ఎల్.ఆర్.ఎస్. రుసుము వసూలుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు రుసుము పూర్తి స్థాయిలో చెల్లించే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, రుసుము వసూలు ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు మున్సిపల్ కమీషనర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.