
ఆంజనేయులు న్యూస్, తాండూర్: మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్షిప్ నాలుగైదు నెలలుగా మంచినీటి సమస్యతో జనం ఇబ్బందులు పడుతున్నారు. కాగా బుధవారం రోజున మాదారం టౌన్షిప్ చెందిన మహిళలు గోలేటి టూ ఖైర్గూడ నాలుగు స్తంభాల చౌరాస్తా వద్ద ఖాళీ బిందలతో నిరసన వ్యక్తం చేశారు. సింగరేణి అధికారుల నిర్లక్ష్యం, అధికార పార్టీ నేతల పట్టింపులేని తనం వల్ల సింగరేణి సరఫరా చేస్తున్న నీటి విషయంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అన్నారు. మోటార్లు తరచూ కాలిపోతుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో నిత్యం బోర్ పంపుల వద్ద జనం క్యూలు కడుతున్నారు. ఇప్పటికే నాలుగైదు సార్లు మోటార్లు కాలిపోయాయి. ఏనా నిర్లక్ష్యం అలాగే కొనసాగుతోంది. సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, అధికార పార్టీ నేతలు అటువైపుగా దృష్టి సారించడం లేదు.
• కొత్త మోటార్లు వచ్చినా ఫలితం సున్నా..
మాదారం టౌన్షిప్ నీటి సమస్య తలెత్తుతున్న నేపథ్యంలో అధికారులు కొత్త మోటార్లు తెప్పించారు. రూ. 23.70 లక్షలతో వీటిని తెప్పించారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇక్కడ ఉన్న పంపులకు తెచ్చిన మోటార్లకు మధ్య కేసింగ్ తేడా రావడంతో అవి ఇక్కడ బిగించే పరిస్థితి లేకుండా పోయింది. మరి అధికారులు తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అన్ని లక్షలు పెట్టి మోటార్లు తీసుకువచ్చే సమయంలో కనీసం వాటి గురించి పట్టించుకోకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..