Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 30 January 2025, 10:55 pm Posted by : Anjaneyulu Dega

10వ తరగతి వార్షిక పరీక్షలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి.

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: 10వ తరగతి వార్షిక పరీక్షలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్.సి. కళాశాల, బాలికల వసతి గృహంలో నిర్వహించిన ప్రేరణ అవగాహన తరగతులకు జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య, ఇన్చార్జ్ ఎస్.సి. డి.డి. రవీందర్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 10వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులు వార్షిక పరీక్షలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రేరణ – అవగాహన తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షలకు 50 రోజుల సమయం మాత్రమే ఉన్నందన, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఏకాగ్రతతో చదవాలని, ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని సాధించే దిశగా పట్టుదలతో కృషి చేయాలని తెలిపారు. పాఠశాలల్లో సిలబస్ పూర్తి చేయడం జరిగిందని, రివిజన్, రెమెడియల్ తరగతులు కొననసాగుతున్నాయని, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.

విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని, నూతన మెను ప్రకారం సకాలంలో పౌష్టికాహారం అందించాలని, అవసరమైన వైద్య సేవలు నిర్వహించి చికిత్స అందించాలని తెలిపారు. విద్యార్థులు పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు 10వ తరగతి స్టడీ మెటీరియల్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వసతి గృహ సంక్షేమాధికారులు తదితరులు పాల్గొన్నారు.