Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 21 December 2024, 8:43 am Posted by : Anjaneyulu Dega

వివాదంలో అనిశా స్థలం

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: అవినీతి నిరోధక శాఖ కార్యాలయ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం ఎదులపూర్, కైలాస్ నగర్ లో కేటాయించిన స్థలం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం 16 గుంటల భూమిని 2016లో అనిశాకు కేటాయించింది. కొందరు అక్రమార్కులు రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)లో దాన్ని ఆక్రమించుకోవటానికి యత్నాలు ప్రారంభించారు. రూ.కోట్ల విలువైన ఆ స్థలంపై ఎల్ఆర్ఎస్ లో హక్కులు పొందినట్లు సమాచారం. అనంతరం దాన్ని ఆక్రమించుకోవడానికి గత అక్టోబరులో ప్రయత్నించగా కొందరు కాలనీవాసులు అడ్డుకున్నారు. సదరు స్థలంలో అధికారులు ఎలా ఎల్ఆర్ఎస్ చేశారో అంతు పట్టని ప్రశ్న. ఒక ప్రభుత్వ కార్యాలయానికి కేటాయించిన స్థలాన్ని మరొకరికి ఎల్ఆర్ఎస్ కింద ఏ విధంగా అప్పగిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది.

స్థలం కబ్జాకు యత్నం జరుగుతుండటంతో అనిశా అధికారులు స్పందించి ఆన్లైన్ లో ఫిర్యాదు చేయగా అప్పుడే కేసు నమోదైంది. ఆ స్థలానికి కొలతలు వేసి హద్దులు నిర్ణయించి ఎవరికి కేటాయించారో తేల్చాలని వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. నేటికీ రెవెన్యూ అధికారులు ఆ స్థలం సర్వే చేయకపోవటం గమనార్హం. ఈ విషయమై వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ ను వివరణ కోరగా.. కేసు నమోదు అనంతరం దర్యాప్తు కొనసాగుతోందని, రెవెన్యూ అధికారులు కొలతలు వేయాల్సి ఉందన్నారు.