Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 05 September 2024, 2:41 pm Posted by : Anjaneyulu Dega

తెలంగాణ విద్యా కమిషన్ పదవి ఎవరిని వరిస్తుంది? రేసులో ఆ నలుగురు..!

ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: ఎన్నికల ముందు రకరకాల పార్టీల్లో చేరతారని ప్రచారం జరిగినా, సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా మెలిగారని చెబుతారు. దాదాపు ఆయనకు కమిషన్ చైర్మన్‌గా నియమించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయంటున్నారు. తెలంగాణలో విద్యా కమిషన్ రేస్ మొదలైంది. ప్రాథమిక విద్య ప్రమాణాలు పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిషన్ లో చైర్మన్‌తోపాటు ముగ్గురు సభ్యులు ఉంటారు. రాజ్యాంగ బద్ధమైన చైర్మన్ పదవికి రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. దీంతో చాలా మంది తెలంగాణా విద్యావేత్తలు ఈ పదవిపై కన్నేశారు. అటు ప్రభుత్వం కూడా పలువురు మాజీ ఐఏఎస్ అధికారులతో పాటు, కొందరు ప్రొఫెసర్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నవారెవరు.. తెలంగాణ విద్యా వ్యవస్థను గాడిన వేసే వారెవరు.

• రేసులో మురళి, హరగోపాల్, నాగేశ్వర్, కోదండరామ్..

తెలంగాణ విద్యా కమిషన్ పదవి ఎవరి వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదాతోపాటు, రాజ్యాంగ బద్ధమైన అధికారాలు ఉండటంతో విద్యా కమిషన్ చైర్మన్ పోస్టుకు చాలా క్రేజ్ ఏర్పడింది. దీనిపై చాలా మంది ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం కమిషన్ ను ఏర్పాటు చేయగా, ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్టుగా పనిచేసే వారి కోసం అన్వేషిస్తోంది. దీంతో పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళితోపాటు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రధాన పోటీదారులుగా చెబుతున్నారు. వీరితోపాటు తెలంగాణ జనసమితి అధినేత, ఎమ్మెల్సీ కోదండరాం కూడా రేసులో ఉన్నట్లు చెబుతున్నారు.