Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 14 June 2024, 11:03 pm Posted by : anjudega

పెద్దపల్లి, నారాయణపేట ఘటనలపై సీఎం రేవంత్ సీరియస్

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: నారాయణపేట, పెద్దపల్లి జిల్లాల్లో జరిగిన అమానుష ఘటనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. భౌతిక దాడులు, అరాచకాలు, హత్యలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి అమానుషంగా హత్య చేయడంపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని డీజీపీ రవిగుప్తాను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని సీఎం భరోసా ఇచ్చారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో పట్టపగలు గువ్వల సంజీవ్ అనే వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపైనా సీఎం సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.