Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 22 May 2024, 6:33 pm Posted by : Anjaneyulu Dega

రైతుల వద్ద నుండి ఆఖరి గింజ వరకు కొనుగోలు చేస్తాం

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా నిబంధనల మేరకు రైతుల వద్ద నుండి ఆఖరి గింజ వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావాత్ మోతిలాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 286 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, ఇప్పటి వరకు జిల్లాలో 15 వేల 839 మంది రైతుల వద్ద నుండి 1 లక్ష 5 వేల 26 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి చేసి 122 కోట్ల 3 లక్షల రూపాయలు సంబంధిత రైతు ఖాతాలలో జమ చేయడం జరిగిందని తెలిపారు. కొనుగోలు సమయంలో రైతుల సంబంధిత వివరాలు, విక్రయించిన ధాన్యం వివరాలను ట్యాబ్‌లలో నమోదు చేస్తున్నామని, కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతుల సౌకర్యార్థం త్రాగునీరు, నీడ ఇతరత్రా మౌళిక సదుపాయాలు కల్పించడం జరిగిందని, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ధాన్యం తరలించేందుకు అవసరమైన గన్నీ సంచులు, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ధాన్యం తడవకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన వరిధాన్యంను ట్యాగింగ్‌ చేయబడిన రైస్‌మిల్లులకు కేటాయించిన మేరకు తరలించడం జరుగుతుందని తెలిపారు.