Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 13 April 2024, 4:06 pm Posted by : Anjaneyulu Dega

వివాదంలో వారణాసి పోలీసుల డ్రెస్‌ కోడ్‌

ఆంజనేయులు న్యూస్, ఉత్తరప్రదేశ్‌: వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో అర్చకుల వేషధారణలో పోలీసులను నియమిస్తూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదం రేపుతోంది. ఆలయంలో విధులు నిర్వర్తించే పోలీసులకు ప్రభుత్వం ఖాకీ దుస్తుల్లో కాకుండా ధోతీ, కుర్తాతో కూడిన సాంప్రదాయ వస్త్రధారణతో డ్రెస్‌ కోడ్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించి వారణాసి పోలీస్‌ కమిషనర్‌ మోహిత్‌ అగర్వాల్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆలయంలో విధుల్లో ఉన్న పోలీసులు ధోతీ, కుర్తా, మెడలో రుద్రాక్ష మాలతో.. మహిళా పోలీసులు సల్వార్‌ కుర్తా ధరించారు. ఈ వ్యవహారంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ స్పందిస్తూ.. ‘పోలీసులను పూజారుల తరహాలో డ్రెస్‌ కోడ్‌ ధరించవచ్చని ఏ పోలీస్‌ మాన్యూవల్‌లో ఉంది? ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చిన వారిని తక్షణ సస్పెండ్‌ చేయాలని, దీన్ని భవిష్యత్తులో అవకాశంగా మార్చుకుని మోసాలకు పాల్పడితే, ప్రజలను దోపిడీ చేస్తే యూపీ ప్రభుత్వం సమాధానం ఇవ్వగలదా?’ అని ప్రశ్నించారు. మరోవైపు సోషల్‌ మీడియాలో సైతం ఈ విషయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..