Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 03 April 2024, 6:54 am Posted by : Anjaneyulu Dega

ఇందిరమ్మ స్థలం భారాస నేత పేరిట పట్టా

తాండూరు తహసీల్దారు కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేస్తున్న శ్రీనివాస్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో తాండూరు మండలం రేచిని పంచాయతీ పరిధిలోని బారెపల్లిలో ఇందిరమ్మ స్థలాలను భారాస మండల అధ్యక్షుడు తన పేరిట తిరిగి పట్టా చేయించుకున్నారు. అయితే కబ్జాదారుల నుంచి తమ స్థలాన్ని కాపాడాలని తాండూరు మండల తహసీల్దారు కార్యాలయ ఆవరణలో ఓ వ్యక్తి మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. బాధితుల కథనం ప్రకారం.. 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 60 మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం తాండూరు మండలం రేచిని గ్రామ పంచాయతీ పరిధి బారెపల్లిలోని సర్వే నెంబర్ 41/ఆ లో 1.17 ఎకరాలు, 45/ఆ లో 1.25 ఎకరాల భూమిని యజమాని అయిన భారాస మండల అధ్యక్షుడు, పీఏసీఎస్ ఛైర్మన్ సుబ్బ దత్తుమూర్తి, దోకె లక్ష్మిల నుంచి కొనుగోలు చేసింది. ఆ స్థలాల్లో ఎవరూ ఇళ్లు నిర్మించుకోలేదు. స్థలం ఖాళీగా ఉండటంతో భారాస మండల అధ్యక్షుడు దత్తుమూర్తి 1.17 ఎకరాలపై కన్నేశారు. 2021లో రాజకీయ పలుకుబడితో ఆయన తన పేరిట అక్రమంగా పట్టా చేయించుకున్నారు. రైతు బంధు పొందుతూ తమకు అన్యాయం చేశారు. ఈ విషయమై బాధితులు తాండూరు తహసీల్దారు కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సమయంలోనే ఆదె శ్రీనివాస్ అనే బాధితుడు తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న ఎస్సై జగదీష్ గౌడ్, ఏఎస్సై లక్ష్మణ్ సంఘటనా స్థలానికి చేరుకొని శ్రీనివాస్ ఆత్మహత్య గల కారణాలు తెలుసుకొని వారించారు. తహసీల్దారు కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో తహసీల్దారు ఇమ్రానాఖాన్ తో చారవాణీ తో మాట్లాడించి ఫిర్యాదును కార్యాలయంలో అందించాలని సూచించారు. దానిపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు.