Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 07 February 2024, 8:02 am Posted by : Anjaneyulu Dega

గ్రంథాలయాల అభివృద్ధి దిశగా చర్యలు

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా అదనపు కలెక్టర్ చాంబర్లో 2024-25 సంవత్సరానికి గాను అంచనా బడ్జెట్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 2023-24 సంవత్సరానికి గాను అంచనాలు, పద్దుల వారిగా నిఖర ఖర్చులతో పాటు 2024-25 సంవత్సరానికి గాను సమగ్ర అంచనా బడ్జెట్ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల నుండి గ్రంథాలయ సంస్థకు చెల్లించవలసిన సెన్సును చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రంథాలయాలలో పాఠకులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన పత్రికలు, పుస్తకాలు, ఇతర మెటీరియల్ను అందుబాటులో ఉంచాలని, గ్రామపంచాయతీలలో అవసరం మేరకు పబ్లిక్ రీడింగ్ రూమ్, వసతి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని దండేపల్లి మండల కేంద్రంలో నూతన శాఖ గ్రంథాలయం కొరకు 30 లక్షల రూపాయలు, వేమనపల్లి మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయ భవనానికి ప్రహారీగోడ, మరుగుదొడ్ల నిర్మాణం కొరకు 12 లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, జిల్లా వయోజన విద్య అధికారి పురుషోత్తం నాయక్, జిల్లా విద్యాశాఖ సెక్టార్ అధికారి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎ.వి.యన్. రాజు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.