Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 02 February 2024, 11:23 am Posted by : ANJANEYULU NEWS

నవజాత శిశువు మృతి

– వైద్యుల నిర్లక్ష్యమని బంధువుల ఆరోపణ

రోదిస్తున్న తల్లి, పక్కన మృతి చెందిన శిశువు

ఆంజనేయులు న్యూస్, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి చెందిందని గర్భిణి బంధువులు ఆరోపించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట మండలం బొంబాయిగూడకు చెందిన రజితకు పురిటినొప్పులు రావడంతో గురువారం ఉదయం ఆరు గంటలకు బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ప్రసవం కాస్త కష్టంగానే ఉంటుందని వైద్యులు గర్భిణి బంధువులకు చెప్పారు. వారు అంగీకరించడంతో ప్రసవం కోసం ప్రయత్నించారు. రెండు గంటల తర్వాత ఆడ శిశువు జన్మించింది. శిశువుకు ఏడుపు రాకపోవడంతో వెంటనే 108లో మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మళ్లీ శిశువును బెల్లంపల్లి ఆసుపత్రికి తీసుకొచ్చి ఆందోళన చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. రెండో పట్టణ ఎస్సై డి. రమేష్ శిశువు మృతిపై విచారణ చేపట్టారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ రవికుమార్ ను వివరణ కోరగా గర్భిణి విషమ పరిస్థితితోనే వచ్చిందని, కుటుంబసభ్యుల అంగీకారంతో ప్రసవం చేశామని చెప్పారు. శిశువు ఆసుపత్రిలో చనిపోలేదని తెలిపారు.