
ఆంజనేయులు న్యూస్, రెబ్బెన: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బేన మండలం నంబాల గ్రామానికి చెందిన ఇంగు వెంకటేష్(36) గుండెపోటుతో మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం. వెంకటేష్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం నడకకు వెళ్లి ఇంటికి వచ్చారు. కాసేపు యోగా చేసిన అనంతరం కిందపడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఆయన మృతదేహాన్ని సీఐఎస్ఎఫ్ అధికారులు, సిబ్బంది సోమవారం స్వగ్రామం నంబాలకు తీసుకువచ్చారు అనంతరం సీఐఎస్ఎఫ్ సిబ్బంది అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడు వెంకటేష్ కు భార్య శ్రీలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యులను జడ్పీటీసీ సభ్యుడు వేముర్ల సంతోష్, సర్పంచ్ చెన్న సోమశేఖర్, ఎస్సై చంద్రశేఖర్, మున్నూరు కాపు సంఘం యువ నాయకుడు కస్తూరి మహేష్ తో పాటు పలువురు పరామర్శించారు.