పోలీసు శాఖ పరిశీలకులు ఆర్. ఇలంగో

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: శాసనసభ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ కొరకు పూర్తి స్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని పోలీసు శాఖ పరిశీలకులు ఆర్.ఇలంగో అన్నారు. శుక్రవారం ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని హాజీపూర్ మండలంలోని ముల్కల్లలో గల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ మా రాజేశ్వరి, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, డి.సి.పి. సుధీర్ రామ్నాథ్ కేకన్, ఎ.సి.పి. తిరుపతిరెడ్డి, పంచాయతీరాజ్ ఈ. ఈ. ఎం. స్వామిరాజ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పూర్తి స్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని, ఈ నెల 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగుతాయని, ఎన్నికల నిబంధనలు డిసెంబర్ 5వ తేదీ వరకు అమలులో ఉంటుందని తెలిపారు. పోలింగ్, కౌంటింగ్ రోజులలో ఎలాంటి ఘటనలు జరుగకుండా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా బందబోస్తు ఏర్పాటు చేయాలని, విధులు నిర్వహిస్తున్న అధికారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సౌకర్యాల నిర్వహణ ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాజీపూర్ తహశిల్దార్, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.