Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 22 August 2023, 10:12 pm Posted by : Anjaneyulu Dega

కార్యకర్తలపై పడి ఏడ్చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

ఆంజనేయులు న్యూస్, జనగామ జిల్లా: స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ తనకే వస్తుందని ఆశించి భంగపాటుకు గురైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజయ్య కన్నీటి పర్యంతమయ్యారు. మంగళవారం తన మద్దతుదారులతో సమావేశమై రాజయ్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తీవ్ర మనోవేదనతో కన్నీరు పెట్టుకున్నారు. జనగామలో అంబేద్కర్ విగ్రహం దగ్గర వర్షంలోనే తడుస్తూ కాసేపు మౌనదీక్ష చేశారు. అంబేద్కర్ విగ్రహం ముందుకు పడుకుని విలపించారు. ఆ తరువాత తన వద్దకు వచ్చిన కార్యకర్తలపై పడి ఎమ్మెల్యే ఏడ్చేశారు. అందరూ సంయమనం కోల్పోకుండా ఓపికతో పనిచేయాలని రాజయ్య సూచించారు. కార్యకర్తలందరూ సమన్వయం పాటించాలని తెలిపారు. 2001 నుంచి ఇప్పటి వరకూ కేసీఆర్‌ను ఒక్క మాట కూడా అనలేదన్నారు.

• తూచా తప్పకుండా పనిచేస్తాను.

‘‘కేసీఆర్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి రమ్మంటే ఆయన చెప్పిన మాట విన్నాను. నీ స్థాయికి తగ్గట్టుగా నీకు అవకాశం ఇస్తాను అని మాట ఇచ్చారు. అధినాయకుడు ఇచ్చిన మాట ప్రకారం అందరం కలిసికట్టుగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేయాలి. అధినాయకుడు చెప్పినట్లుగా ఏ పని చెప్పినా తూచా తప్పకుండా పనిచేస్తాను’’ అంటూ ఎమ్మెల్యే రాజయ్య వెల్లడించారు.

• రాజయ్య సతీమణి స్పందన..

బీఆర్‌ఎస్ టికెట్ రాకపోవడంతో ఎమ్మెల్యే రాజయ్య సతీమణి ఫాతిమా మేరీ స్పందించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. తాము ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోబోమన్నారు. పదవి అనేది ముళ్ల కిరీటంగా చెప్పుకొచ్చారు. ఒక కుటుంబంలో అందరికీ న్యాయం చేయాలని కేసీఆర్ చూసినట్టున్నారన్నారు. కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకించమని… కడియం కోసం ప్రచారం చేస్తామని రాజయ్య సతీమణి ఫాతిమా మేరీ వెల్లడించారు. కాగా.. సోమవారం సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్‌ఎస్ జాబితాలో రాజయ్యకు చోటు దక్కలేదు. స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ రాజయ్యకు కాకుండా కడియం శ్రీహరికి ఇస్తూ బీఆర్‌ఎస్‌ అధినేత నిర్ణయం తీసుకున్నారు. దీంతో టికెట్ ఆశించిన రాజయ్యకు భంగపాటు తప్పలేదు..