Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 19 August 2023, 6:06 pm Posted by : Anjaneyulu Dega

ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి.

మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటు హక్కు ద్వారా సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బదావత్ సంతోష్ అన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం రోజున జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో గల తిలక్ స్టేడియం నుండి గ్రౌండ్ 2 వరకు ఐ ఓట్ ఫర్ షూర్ (నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను) అనే నినాదంతో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి సురేష్, ఏ సి పి సదయ్య తో కలిసి 5కె రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని, భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం జరిగిందని తెలిపారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికల సమయంలో తప్పనిసరిగా తమ ఓటును వినియోగించుకొని సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని తెలిపారు. గ్రామ, మండల, నియోజకవర్గస్థాయిలలో మనకు మంచి చేసే నాయకులను ఎన్నుకోవడం మన హక్కు అని అన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ప్రలోభాలకు, ఒత్తిడులకు లోను కాకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఓటు వేసి మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని తెలిపారు. జిల్లాలోని 18 సంవత్సరాలు వయసు నిండిన ప్రతి ఒక్కరు తమ వివరాలను నమోదు చేసుకుని ఓటు హక్కు పొందాలని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ వయసు అర్హత గల వారు తమ వివరాలు నమోదు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. ఎన్నికల సంవత్సరం అయినందున వయసు అర్హత కలిగిన ప్రతి ఒక్కరు తమ వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, యువతి యువకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.