మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో బోదకాలు వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు అధికారుల సమన్వయంతో కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం అన్నారు. జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవన సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి.సి. సుబ్బారాయుడు, జోనల్ మలేరియా అధికారి డా॥ సునీల్, మలేరియా సహాయ సంచాలకులు నాగయ్య, జిల్లా మలేరియా అధికారి డా॥ అనితతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి బోదకాలు మాత్రలను ఉద్యోగులకు అందించి, తాను స్వయంగా తీసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1 వేయి 614 బృందాలను, 3 వేల 228 డ్రగ్ అడ్మినిస్ట్రేటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 10 నుండి 12వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1 వేయి 614 కేంద్రాలలో మందులు అందించడం జరుగుతుందని, 13 నుండి 22వ తేదీ వరకు ఇంటింటికి తిరిగి మందులను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమయంలో మాత్రలు తీసుకోని వారికి ఈ పుల 23 నుండి 25వ తేదీ వరకు అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 7 లక్షల 72 వేల మందికి అందించేందుకు మాత్రలు సిద్ధంగా ఉన్నాయని, గర్భవతులకు, 2 సం||ల లోపు వయస్సు గల పిల్లలకు, వ్యాధిగ్రస్తులకు ఇవ్వడం జరుగదని తెలిపారు. బోద వ్యాధి నివారణ కొరకు అందరు ఈ మాత్రలు తీసుకోవాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసి బృందాల సభ్యులు జిల్లాల పరిధిలో నిర్వహించే మందుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరుగుతుందని, అధికారులు అలసత్వం వహించకుండా పూర్తి స్థాయిలో లక్ష్యాలను సాధించే విధంగా పని చేయాలని, మంచిర్యాలను బోద వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని, ప్రజలు అందరు ఈ మందులు తీసుకొని సహకరించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ పర్యవేక్షకులు విశ్వేశ్వర్రెడ్డి, ఉప వైద్యాధికారి డా॥ విజయనిర్మల, ప్రోగ్రామ్ అధికారి డా॥ నీరజ, డా॥ ఫయాజ్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, సబ్ యూనిట్ అధికారి నాందేవ్, సత్యనారాయణ, అల్లాడి శ్రీనివాస్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.