మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రభుత్వ ప్రణాళికల తయారీలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ గణన కీలకమైనదని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ముఖ్య ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ముఖ్య ప్రణాళిక అధికారి జి. సత్యం, జిల్లా వ్యవసాయ అధికారి జి.కల్పనతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రణాళికల తయారీలో వ్యవసాయ గణన కీలకమైదని, 2021-22 సంవత్సరం ఆధారంగా చేసుకొని గణన నిర్వహించేందుకు ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లు తీసుకున్న శిక్షణలో గణన సంబంధిత అంశాలపై పూర్తిగా తెలుసుకోవాలని తెలిపారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారి, ముఖ్య ప్రణాళిక అధికారి, ఉద్యానవన అధికారి, నీటి పారుదల శాఖ అధికారి, పంచాయతీ అధికారి, పశు సంవర్ధకశాఖ అధికారి సభ్యులుగా ఉంటారని తెలిపారు. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ల ద్వారా డిజిటల్ విధానంలో వివరాలను సేకరించి యాప్ ద్వారా గణన చేయడం వలన ఖచ్చితమైన సమాచార నమోదు సులవు అవుతుందని, ఈ నెల 20వ తేదీ లోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. సామాజిక వర్గాల వారిగా రైతుల సంఖ్య సాగు కమతాల విస్తీర్ణం, పంటల రకం, నీటి వినియోగం, వ్యవసాయానికి అందుబాటులో ఉన్న యంత్రాల వివరాలు, సాగు నీటి వనరులు, వ్యవసాయ సంబంధిత పూర్తి సమాచారాన్ని భూ కమతాల వారిగా రెవెన్యూ గ్రామాన్ని యూనిట్గా తీసుకొని మొబైల్ ద్వారా సర్వే / గణన చేయడంతో పాటు ప్రభుత్వ ప్రణాళిక రూపకల్పన ఆవశ్యకతపై రాష్ట్ర అర్థగణాంక శాఖ ఉప సంచాలకులు పి.రవీందర్రెడ్డి, జిల్లా ఉప గణాంక అధికారి అశోక్ రెడ్డి పవర్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమం ఉప గణాంక అధికారులు, మండల ప్రణాళిక, గణాంక అధికారులు, వ్యవసాయ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.