Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 09 August 2023, 10:59 am Posted by : Anjaneyulu Dega

3 లక్షలకు 30 కండిషన్లు

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి స్కీమ్ మహిళలకు సరికొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. ఈ స్కీమ్ కింద సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ.3 లక్షలు సాయంగా అందించనున్నది. మహిళ పేరు మీదే డబ్బులు ఇస్తామని మార్గదర్శకాల్లో జూన్ 21న ప్రకటించింది. ఇప్పటివరకూ మహిళలు వారి పేరు మీద ఇన్‌కమ్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. కానీ ఈ స్కీమ్‌తో ఆ సర్టిఫికెట్ తీసుకోవడం అనివార్యంగా మారింది. దీంతో ‘మీ సేవ’ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. మరి కొద్ది మంది మండలాఫీసులకు క్యూ కడుతున్నారు. స్కీమ్ కింద వచ్చే సాయం కోసం గడువు తక్కువగా ఉండడంతో ఆ లోపే ఇన్‌కమ్ సర్టిఫికెట్ పొందడం వారికి కత్తిమీద సాములా మారింది.

• ఒక్కో జిల్లాలో ఒక్కో తీరు.

‘గృహలక్ష్మి’ పథకానికి అప్లై చేయాలంటే పట్టణ ప్రాంతాల్లో గరిష్ట వార్షిక ఆదాయం రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర లక్షకు మించి ఉండొద్దని ప్రభుత్వం సీలింగ్ విధించింది. ఆ ప్రకారం మహిళలు ఇన్‌కమ్ సర్టిఫికెట్ పొందాల్సి ఉన్నది. ఇప్పటికే చాలా పథకాలకు మహిళలు ఇన్‌కమ్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం తలెత్తలేదు. కానీ ఈ స్కీమ్‌ కేవలం మహిళలకు మాత్రమే ఇవ్వాలని సర్కారు నిర్ణయం తీసుకోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఒకే తరహా విధానాన్ని అమలు చేయడం లేదు. దీని బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పజెప్పడంతో ఒక్కో డిస్ర్టిక్‌లో ఒక్కో తీరులో షెడ్యూల్ ఖరారైంది…!!