Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 26 July 2023, 10:44 am Posted by : Anjaneyulu Dega

విమానం గుల్ల.. అత్యవసర ల్యాండింగ్..!

ఆంజనేయులు న్యూస్: ఇటలీలోని మిలన్ నుంచి అమెరికా లోని న్యూయార్క్ జేకేఎఫ్ ఎయిర్ పోర్టుకు బయల్దేరిన విమానం తీవ్రంగా దెబ్బతిని రోమ్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. డెల్టా ఎయిర్లైన్స్ కు చెందిన 185 నంబర్ విమానం 215 మంది ప్రయాణికులతో మిలన్ నుంచి బయల్దేరింది. ఆ సమయంలో వాతావరణం అనుకూలంగానే ఉంది. కానీ, ప్రయాణం ఆరంభించిన 15 నిమిషాల తర్వాత తీవ్రమైన వడగళ్లు, పిడుగులతో కూడిన వానలో చిక్కుకుంది. దీంతో విమానం ముక్కు, రెక్కలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. విమానాన్ని నియంత్రించడం పైలట్లకు ఇబ్బందికరంగా మారింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా రోమ్ లో ల్యాండింగ్ చేశారు. ఈ విషయంపై డెల్టా ఎయిర్లైన్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘మిలన్ నుంచి న్యూయార్క్ బయల్దేరిన డెల్టా ఫ్లైట్ 185ను వాతవరణం కారణంగా రోమ్ లో ల్యాండ్ చేశాం. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు” అని వెల్లడించారు. ప్రస్తుతం విమానం స్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. విమానానికి జరిగిన నష్టాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. కానీ, ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్టు చేసిన చిత్రాల్లో విమానం ముక్కు పూర్తిగా ధ్వంసమైనట్లు ఉంది. దీంతోపాటు రెండు ఇంజిన్లు, రెక్కలు కూడా వడగళ్ల కారణంగా దెబ్బతిన్నాయి. విమానంలో 215 మంది ప్రయాణికులు, 8 మంది సహాయక సిబ్బంది, ముగ్గురు పైలట్లు ఉన్నారు. వడగళ్ల వర్షంలో చిక్కుకొన్నాక విమానం ఒక్కసారిగా అదుపు తప్పిందని ప్రయాణికులు వెల్లడించారు. ఒక దశలో విమానం ముక్కలైపోతుందేమోనని తాము భయపడ్డామని ఓ ప్రయాణికురాలు పత్రికలకు వెల్లడించారు. రోలర్ కోస్టర్ ఎక్కినట్లు తమకు అనిపించిందని తన అనుభవాన్ని పంచుకొన్నారు..