
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన జనగామ స్వప్న హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసిపి సుధీర్ రాంనాథ్ కేకన్, ఎసిపి తిరుపతి రెడ్డి పూర్తి వివరాలు వెల్లడించారు. హత్యకు పాల్పడిన వేల్పుల మధుకర్, వేల్పుల వెంకటి, వేల్పుల రాజేష్ తో పాటు సమాచారం ఇచ్చిన ఉల్లేందుల రాజమణిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వేల్పుల మధుకర్ తో మృతురాలికి 2014లో రెండవ వివాహం జరిగింది. అదే ఏడాది దళిత బస్తి కింద మూడెకరాల భూమి మంజూరు కాగా మృతురాలి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు. కొంతకాలం తర్వాత ఆమెలో మార్పు వచ్చి మధుకర్ స్నేహితుడు జనగామ రవితో అక్రమ సంబంధం పెట్టుకొని 2019 నుండి మంచిర్యాలలోని రాజీవ్ నగర్ లో కాపురం సాగిస్తోంది. పెద్ద మనుషుల సమక్షంలో మధుకర్, మృతురాలు విడిపోగా, ఒప్పందం ప్రకారం మృతురాలి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన భూమిని మధుకర్ పేరు మీదకు మార్చాలని, అందుకు మధుకర్ రూ. 3 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే తనతో ఉండనందున మధుకర్ మృతురాలికి డబ్బులు ఇవ్వకుండా భూమి దున్నుకుంటున్నాడు. ఈ క్రమంలో భూమిని భర్త రవి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తానని మృతురాలు చెప్పడంతో మధుకర్ పగతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. భూమిలో సబ్సిడీ కింద బోర్ కోసం శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలోని ఎస్సీ కార్పోరేషన్ లో దరఖాస్తు చేసుకొనేందుకు వస్తున్నట్లు తన పెద్దమ్మ కూతురు రాజమణి ద్వారా మధుకర్ తెలుసుకొని హత్యకు పథకం పన్నాడు. నిందితులు ముగ్గురు బైక్ పై వచ్చి మున్సిపల్ కార్యాలయం వద్ద వేచి చూసి మృతురాలు బయటకు రాగానే కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు నిందితులను శనివారం తెల్లవారుజామున ఇందారం ఎక్స్ రోడ్డు వద్ద, రాజమణిని వెంచపల్లిలో అరెస్టు చేశారు. నిందితుల నుంచి రెండు కత్తులు, మూడు సెల్ ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ ఇన్స్పెక్టర్ ముస్కె రాజు, ఎస్సైలు తహసీనుద్దీన్, ఉదయ్ కిరణ్, సుగుణాకర్, సురేష్, రాజేందర్, సిబ్బంది రాము, సతీష్, మల్లేష్, సురేష్, తిరుపతి, మహేష్ ను డిసిపి అభినందించారు.