Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 15 April 2023, 3:36 pm Posted by : Anjaneyulu Dega

అందిన కాడికి దోచుకున్న మోసగాళ్ళు

ఆంజనేయులు న్యూస్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: పట్టణానికి చెందిన ఓ వ్యాపారి నుంచి రూ. 1.95 లక్షలు దోచుకున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. పట్టణానికి చెందిన ఓ వ్యాపారికి గతనెల 19న అపరిచిత నంబర్ ద్వారా ఫోన్ వచ్చింది. అసభ్యంగా మాట్లాడటంతో ఆయన ఉచ్చులో పడ్డాడు. మరుసటి రోజు ఓ మహిళ డీపీతో ఉన్న నంబరు నుంచి వాట్సప్ వీడియో కాల్ వచ్చింది. అందులో ఆమె నగ్నంగా ఉండటంతో వెంటనే కాల్ కట్ చేశాడు. కొంతసేపటి తర్వాత మరో నంబర్లో కాల్ చేసి మహిళ డబ్బులు అడగడం మొదలు పెట్టింది. ఇవ్వకుంటే నాతో మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తానని బెదిరించింది. మరికొద్ది సేపటికి ఇంకో నంబర్ బాధితుడికి కాల్ వచ్చింది. దిల్లీ సైబర్ క్రైమ్ అధికారిని మాట్లాడుతున్నట్లు చెప్పాడు. మీరు మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ అయిందని. తొలగించాలంటే డబ్బులు పంపాలంటూ నంబరు చెప్పాడు. ట్రూ కాలర్లో పరిశీలిస్తే సదరు వ్యక్తి ఫొటో పోలీసు దుస్తుల్లో కనిపించడంతో బాధితుడు నిజమని నమ్మాడు. దీంతో గతనెల 20న అయిదు విడతలుగా రూ. 1.95 లక్షలు పంపించాడు. మరుసటిరోజు మళ్లీ ఫోన్ చేసి ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు విషయాన్ని ఓ స్నేహితుడి దృష్టికి తీసుకెళ్లాడు. అలాంటివి నమ్మద్దని ఇదంతా మోసమని వివరించాడు. ఆ నంబర్ బ్లాక్ లో  పెట్టమనడంతో అలాగే చేశాడు. విషయం బయట చెబితే పరువు పోతుందని ఎవరికి చెప్పనట్లు తెలిసింది. పెద్దమొత్తంలో మోసపోవడంతో స్థానికంగా ఈ విషయం చర్చనీయాంశమవుతోంది.