Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 01 April 2023, 11:40 am Posted by : Anjaneyulu Dega

టోల్ ఛార్జీల మోత.!

ప్రయాణికులపై నెలకు రూ.15 లక్షల అదనపు భారం

మందమర్రిలో టోల్ గేట్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మందమర్రి పట్టణం, అసలే పెరిగిన ఇంధన, నిత్యావసర సరకుల ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా టోల్ గేట్ల రుసుం నేటి నుంచి 5 శాతం పెరగడంతో వాహన చోదకులపై మరింత భారం పడనుంది. జాతీయ రహదారిపై టోల్ గేట్ల ఛార్జీల పెంపు మంచిర్యాల జిల్లాలో సుమారు 7 వేల మంది వాహనదారులపై ప్రభావం చూపనుంది. మంచిర్యాల జిల్లా ఇందారం క్రాస్ నుంచి కుమురం భీం జిల్లా గోయగాం వరకు జాతీయ 363 నాలుగు వరుసల విస్తరణ పనులు రెండు విభాగాలుగా చేపట్టారు. మంచిర్యాల జిల్లాలో చాలా వరకు పూర్తయ్యాయి. మందమర్రి పట్టణ శివారులో డిసెంబర్ 30న టోల్ గేట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాహన పరిమాణాన్ని బట్టి రూ.35-335 వరకు వివిధ కేటగిరీల వారీగా రుసుం వసూలు చేస్తున్నారు. కార్లు, బస్సులు, భారీ, అతి భారీ వాహనాలు టోల్ గేట్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం వీరి నుంచి రూ.4.80 లక్షల నుంచి 5.40 లక్షలు టోల్ రుసుం వసూలు చేస్తున్నారు. నేటి నుంచి 5 శాతం పెరగడంతో ఒక్కో వాహనంపై రూ.5 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేయనున్నారు. ఇలా రోజుకు రూ. 30-50 వేలు వసూలు కావడంతో నెలకు సుమారుగా రూ.15 లక్షల భారం వాహన చోదకులపై పడనుంది.

• భవిష్యత్తులో మరింత భారం

ఇందారం క్రాస్ నుంచి రేపల్లెవాడ వరకు 42 కి.మీ.. రేపల్లెవాడ నుంచి గోయగాం గ్రామం వరకు 52 కి. మీ. పనులను 2020 సంవత్సరంలో ప్రారంభించారు. ప్రస్తుతం క్యాతనపల్లి, మందమర్రి, తాండూరు, రెబ్బెన వద్ద వీయూపీ, ఫ్లైఓవర్ వంతెన పనులు పూర్తికాలేదు. మిగతా కొన్ని చోట్ల రహదారి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని టోకు ధరల సూచి ఆధారంగా ప్రస్తుతం మందమర్రి టోల్ గేట్ వద్ద రుసుం వసూలు చేస్తున్నారు. రహదారి విస్తరణ పనులు పూర్తయితే ప్రస్తుతం ఉన్న ధరకు రెట్టింపు వసూలు చేసే అవకాశముంటుంది.