Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 13 March 2023, 8:14 am Posted by : Anjaneyulu Dega

విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించాలి

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. మధుసూదన్ నాయక్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని విద్యార్థినీ విద్యార్థులు పట్టుదలతో చదివి వార్షిక పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. మధుసూదన్ నాయక్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, సాయి కుంటలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర వసతిగృహం, షెడ్యూల్డ్ కులముల బాలుర వసతిగృహం, షెడ్యూల్ తెగల బాలుర వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థినీ విద్యార్థులతో మాట్లాడారు. వార్షిక పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యార్థినీ విద్యార్థులు పట్టుదలతో చదవాలని, ఫలితాలలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తుందని, మొదటి గృహాలలో చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పై చదువులు అభ్యసించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థిని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వసతి గృహంలోని విద్యార్థుల గదులు, పరిసరాలు, వంటశాలలు, మూత్రశాలలు పరిశుభ్రంగా ఉండే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. షెడ్యూల్డ్ కులాల కళాశాల వసతి గృహంలో నెలకొన్న అపరిశుభ్ర పరిస్థితులపై సంబంధిత వసతి గృహ వార్డెన్ సిహెచ్. కుమారస్వామికి షోకాస్ నోటీస్ జారీ చేయాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు పి.రవీందర్ రెడ్డిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డి. సుమతి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.