Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 13 March 2023, 11:44 am Posted by : Anjaneyulu Dega

రూ.5 కోట్లు వెచ్చించినా.. ఎత్తిపోయని నీరు

తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దున ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామ శివారులో పెన్ గంగ ఒడ్డున నిర్మించిన ఎత్తిపోతల పథకం అయిదేళ్లుగా నిరుపయోగంగా ఉంది.

నాణ్యతలేమితో నిధులు వృథా.. నిర్మించి వృథాగా ఉన్న పథకం

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దున ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామ శివారులో పెన్ గంగా ఒడ్డున నిర్మించిన ఎత్తిపోతల పథకం అయిదేళ్లుగా నిరుపయోగంగా ఉంది. రూ. అయిదు కోట్ల వ్యయంతో ఈ పథకం నిర్మించినా… పొలాలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. పనులు నిర్వహించిన గుత్తేదారుకు కాసుల వర్షం కురిపించి.. ఇది అధికారుల పర్యవేక్షణ లోపానికి సాక్ష్యంగా నిలుస్తోంది. బేల మండలం సాంగిడి గ్రామం ఆనుకొని పెన్ గంగా ప్రవహిస్తోంది. సాంగిడి గ్రామ శివారులో 400 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. తెలంగాణ నీటి పారుదల సంస్థ ఆధ్వర్యంలో 2018 సంవత్సరంలో రూ.5.40 కోట్ల నిధులు విడుదల చేసింది. పెన్ గంగా నది నుంచి ప్రత్యేక మోటర్లతో నీటిని ఎత్తిపోసి.. కాలువల ద్వారా పొలాలకు అందించాల్సి ఉంది. ఎత్తిపోతల పథకం నిర్మించిన చోట దాదాపుగా ఆరు క్యూసెక్కుల నీటి లభ్యత ఉందని గుర్తించిన అధికారులు ఆ తర్వాత పనుల తీరును పట్టించుకోలేదు. ఫలితంగా గుత్తేదారు నాణ్యతలేని ఓ పంపుహౌస్, మూడు పెద్ద పైపులు వేశారు. పర్యవేక్షణ కొరవడడంతో పథకం ప్రారంభానికి ముందే పగుళ్లు తేలాయి. పైపులు తుప్పుపడుతున్నాయి. విద్యుత్తు సరఫరాకు నామమాత్రపు ఉపకేంద్రాన్ని నిర్మించారు.