Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 04 March 2023, 10:58 am Posted by : anjudega

పేరుకుపోయిన ధరణి దరఖాస్తులు

నూతన పాలనాధికారిగా బాధ్యతలు స్వీకరించి నెల రోజులు గడిచిన రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడం లేదు. పరిష్కరించాలని దరఖాస్తు చేసుకున్న రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు

45 రోజులుగా పరిశీలించని వైనం

ధరణి పోర్టల్ లో కలెక్టర్ లాగిన్ లో పెండింగ్ లో ఉన్నట్లు చూపిస్తున్న దృశ్యం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: నూతన పాలనాధికారిగా బాధ్యతలు స్వీకరించి నెల రోజులు గడిచినా రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడం లేదు. పరిష్కరించాలని దరఖాస్తు చేసుకున్న రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకొని నగదు చెల్లింపులు చేసుకొని 45 రోజులు గడుస్తున్నా రైతులకు నిరీక్షణే మిగులుతోంది. నూతన పాలనాధికారిగా బాదావత్ సంతోష్ బాధ్యతలు స్వీకరించి నెల రోజులవుతుంది. అప్పటి వరకు బాధ్యతలు నిర్వర్తించిన పాలనాధికారి భారతిహోళ్లి కేరి బదిలీకి ముందు పక్షం రోజుల పాటు దరఖాస్తులు పరిశీలించలేదు. దీంతో 18 మండలాలకు చెందిన రెవెన్యూ దరఖాస్తులు పెండింగ్ లోనె ఉన్నాయి. దాదాపు వేల దరఖాస్తులు పెండింగ్ ఉన్నట్లు సమాచారం. మీ సేవా కేంద్రంలో దరఖాస్తులు చేసుకొని నగదు చెల్లింపులు చేసి పాలనాధికారి మోక్షం కోసం ఎదురుచూస్తున్నామని పలువురు బాధితులు పేర్కొంటున్నారు.

• విరాసత్, మిస్సింగ్ సర్వే నంబర్లు

తాతతండ్రుల పేరిట ఉన్న భూములకు నూతన పట్టాదారు పాసు పుస్తకం రాని రైతులకు తండ్రుల మరణించిన తర్వాత తమ పేరిట పట్టా చేయాలని వారసులు విరాసత్ కింద మీ సేవా కేంద్రంలో ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ తదితరాలను ముందుగానే చెల్లింపులు చేస్తారు. దరఖాస్తుదారుడి వివరాలు నేరుగా పాలనాధికారి లాగిన కు వెళ్తుంది. వాటి వివరాలను మండల రెవెన్యూ అధికారులకు మెయిల్ ద్వారా పంపిస్తారు. వాటి ఆధారంగా అధికారులు విచారణ చేసి రిపోర్టు ఆర్డీవో కార్యాలయానికి పంపిస్తారు. అక్కడ నుంచి పాలనాధికారి కార్యాలయానికి వెళ్తుంది. పాలనాధికారి పరిశీలించి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆయన ఆమోదం తర్వాతనే వారసులకు పట్టా చేసుకునే అవకాశముంటుంది. ఇలా దాదాపు 10 రకాల రెవెన్యూ దరఖాస్తులు ఉంటాయి. ఇలా 10 రకాల దరఖాస్తులు 45 రోజులుగా పెండింగ్ లోనె ఉన్నాయి. ఆయన ఆమోదం కోరకు వేల మంది రైతులు ఎదురుచూస్తున్నారు.

• నెల రోజులవుతుంది

-శంకర్, రైతు, కన్నెపల్లి

మా తాత పేరిట ఉన్న భూమిని తమకు పట్టా చేయాలని మేము ఇద్దరం అన్నదమ్ములం విరాసత్ కింద దరఖాస్తు చేసుకున్నాం. దాదాపు నెల రోజులవుతున్న ఇంకా పాలనాధికారి కార్యాలయంలోనే పెండింగ్ ఉన్నట్లు చూపిస్తుందని అధికారులు చెబుతున్నారు. పాలనాధికారి దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని కోరుతున్నాం.