సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో బుధవారం ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆదివారం కన్నుమూసింది. నిమ్స్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు.
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: వైద్య విద్యార్థిని ప్రీతి ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఆదివారం మృతిచెందింది. సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థినికి నిమ్స్ చికిత్స అందించారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమె తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. కాకతీయ వైద్యకళాశాలలో పీజీ మత్తు వైద్యం (అనస్థీషియా) మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని సీనియర్ పీజీ విద్యార్థి సైఫ్ కొన్నాళ్లుగా వేధిస్తుండడంతో తాళలేక ఆమె హానికరమైన ఇంజెక్షన్ చేసుకుని బలవన్మరణానికి యత్నించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ప్రీతికి.. తొలుత వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని నిమ్స్ కు తీసుకొచ్చారు. ఆమె ప్రాణాలు కాపాడేందుకు నిమ్స్ వైద్యుల బృందం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మరికొద్దిసేపట్లో ప్రీతి మృతదేహాన్ని అధికారులు అంబులెన్స్ గాంధీ ఆస్పత్రికి తరలించనున్నారు. భారీ పోలీసులు బందోబస్తుతో మృతదేహన్ని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.