ఆరోగ్యం బాగుపడటం లేదని మనస్థాపానికి చెందిన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకుంది.
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఆరోగ్యం బాగుపడటం లేదని మనస్థాపానికి చెందిన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే… మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండ గ్రామానికి చెందిన సత్తయ్య, రజని దంపతులకు హారిక (19) స్థానికంగా ఓ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. అయితే ఈ యువతి తెలియని ఓ జబ్బుతో గత మూడేళ్లుగా బాధపడుతుంది. తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రులకు తిప్పి లక్షలు పోసి చూపించారు. అలా కొన్ని రోజులు గడిచాక బాగానే ఉండటంతో రోగం కుదుటపడిందని కూతురుతో పాటు తల్లిదండ్రులు కూడా సంతోషించారు. కానీ కొన్ని రోజులకు తగ్గింది అనుకున్న రోగం తిరగబడింది. దీంతో మళ్లీ ఆమెను ఆసుపత్రుల చుట్టూ తిప్పడం ప్రారంభించారు. అయినా రోగం తగ్గలేదు. దీంతో మనస్థాపం చెందిన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గమనించిన బంధువులు హారిక తల్లిదండ్రులకు సమాచారం అందించగా వారు ఆమెను హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. కానీ హారిక అప్పటికే మరణించింది. దీంతో ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ ఏడ్చిన తీరు అక్కడ ఉన్నవారందరినీ కదిలించింది.