Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 28 December 2022, 1:32 pm Posted by : Anjaneyulu Dega

కేసీఆర్ చేతిలో తెలంగాణ విధ్వంసం: రేవంత్ రెడ్డి

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: దేశం, రాష్ట్రం ప్రమాదంలో ఉన్నాయని.. ఇలాంటి సమయంలో వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కాంగ్రెస్‌ శ్రేణులు ప్రజల కోసం పోరాడాలని టీపీసీసీ  అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ 138వ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జెండాను రేవంత్‌ ఆవిష్కరించారు. దేశ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటుంటే ప్రశ్నించలేని దౌర్భాగ్య స్థితిలో మోదీ సర్కార్‌ ఉందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రాహుల్‌ గాంధీ హెచ్చరించినా దేశ భద్రత కేంద్రానికి పట్టడం లేదని విమర్శించారు. జనవరి 26 నుంచి ప్రారంభమయ్యే ‘హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర’లో కాంగ్రెస్‌ శ్రేణులంతా పాల్గొని ప్రజల పక్షాన నిలవాలని విజ్ఞప్తి చేశారు.
‘‘దేశాన్ని ముప్పు నుంచి కాపాడేందుకే.. మహాత్ముడి స్ఫూర్తితో రాహుల్‌ పాదయాత్ర చేస్తున్నారు. రాహుల్‌ పాదయాత్ర భయంతోనే మోదీ కొవిడ్‌ రూల్స్‌ తీసుకొచ్చారు. దేశ సమగ్రతను పణంగా పెట్టి భాజపా కుట్రలు చేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతిలో రాష్ట్రం విధ్వంసానికి గురైంది. కుటుంబ సభ్యులకు దోచిపెట్టడానికి ఇప్పుడు దేశం మీద పడ్డారు’’ అని రేవంత్‌ ఆరోపించారు.