Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 26 December 2022, 4:07 pm Posted by : Anjaneyulu Dega

సైలెంట్ గా ఉన్న చంద్రబాబుకు ఆ అవకాశం ఇచ్చింది కేసీఆరే: జగ్గారెడ్డి

సైలెంట్ గా ఉన్న తెదేపా అధినేత చంద్రబాబును తెలంగాణకు వచ్చేలా చేసింది సీఎం కేసీఆర్ అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ మనసులో ఎక్కడో ఇంకా సమైక్య భావన ఉందన్నారు.

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: పార్టీ పేరు మార్పు చేసి సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను అవమానించారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ ఏపీకి వెళ్తున్నారు కాబట్టే తెదేపా అధినేత చంద్రబాబు తెలంగాణకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సీఎల్పీ కార్యాలయంలో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సైలెంట్ గా ఉన్న చంద్రబాబును రాష్ట్రానికి వచ్చేలా కేసీఆర్ అవకాశం ఇచ్చారన్నారు. ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ ప్రభావం చూపించలేరు కానీ, తెలంగాణలో చంద్రబాబు ప్రభావం చూపించగలరని అభిప్రాయం వ్యక్తం చేశారు. “పార్టీ పేరు నుంచి తెలంగాణను తీసేయడంతో తెలంగాణ వాదాన్ని చంపేయడమే కాకుండా తన బలాన్ని కేసీఆర్ కోల్పోయారు. సీఎం కేసీఆర్ మనసులో ఎక్కడో ఇంకా సమైక్య భావన ఉంది. రాజకీయ బతుకునిచ్చిన చెట్టునే ఆయన నరికేశారు. కూటములు, పొత్తులపై భవిష్యత్తులో తెలుస్తుంది. ఇకపై రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. మహారాష్ట్ర, కర్ణాటకకు బీఆర్ఎస్ వెళ్తే.. తెదేపా కూడా వెళ్తుంది. బీఆర్ఎస్ తో కేసీఆర్ విజయం సాధించే పరిస్థితి లేదు” అని అన్నారు.