Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 23 December 2022, 10:34 pm Posted by : Anjaneyulu Dega

ప్రభుత్వ పథకాలను ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రజలు వినియోగించుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్ తో కలిసి జిల్లా అధికారులు, తహశిల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, సహాయ పంచాయతీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపొందించడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛమైన సహజ వాయువు అందించడంతో వారి ఆరోగ్యాన్ని కాపాడవచ్చని అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం చేపట్టిన తెలంగాణకు హరితహారం, పల్లెప్రగతి కార్యక్రమాలలో భాగంగా బృహత్ పల్లెప్రకృతి వనాలు, పల్లెప్రకృతి వనాలలో మొక్కలు సంరక్షణ చేపట్టడం జరుగుతుందని, హరితహారంలో భాగంగా మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా అటవీ శాతం పెంచి వాతావరణ సమతుల్యతను కాపాడవచ్చని తెలిపారు. గ్రామాలలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు, సమస్యాత్మక భూముల వివరాలతో పూర్తి స్థాయి నివేదిక తయారు చేసి అందించాలని, మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైకుంఠధామాలు శ్మశానవాటిక) ఏర్పాటులో జిల్లాలో దాదాపు లక్ష్యాన్ని పూర్తి చేయడం జరిగిందని, ఈ క్రమంలో వైకుంఠధామాలలో విద్యుత్, బోర్వెల్, నీటి వసతులను కల్పించి ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటులో జిల్లాలోని మండలానికి 2 చొప్పున మొదటి విడతలో కేటాయించడం జరిగిందని, క్రీడా ప్రాంగాణల నిర్మాణం, సమకూర్చవలసిన క్రీడా సామాగ్రి అంశాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్, ఇన్చార్జ్ జిల్లా పంచాయతీ అధికారి ఫణీందర్ రావు, రాజస్వ మండల అధికారి వేణు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.