
జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్ర మైనారిటీలు ఫైనాన్స్ కార్పొరేషన్ (టి.ఎస్.ఎం.ఎఫ్.సి.) ఆర్థిక సహాయ పథకం / బ్యాంక్-లింక్డ్ సబ్సిడీ స్కీమ్ ద్వారా మైనారిటీలకు కేటగిరీ-1, కేటగిరీ-2 రాయితీ రుణాలను 2022-23 ఆర్థిక సంవత్సరంలో అర్హులైన మైనారిటీ అభ్యర్థులైన ముస్లింలు, సిక్కులు, పార్శీలు, బౌద్ధులు, జైనులకు రాయితీ ద్వారా ఆర్థిక సహాయం అందించడం కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మైనారిటీల కమ్యూనిటీల ఆర్థికాభివృద్ధి, సాధారణ అభ్యున్నతి కోసం వ్యాపార యూనిట్ల ఏర్పాటు, అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఆర్థిక సహాయ పథకం క్రింద బ్యాంక్ లింక్డ్, నాన్-లింక్డ్ రుణాల కొరకు అర్హులైన, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వారై ఉండాలని, 21-55 సం॥ల మధ్య వయస్సు ఉండాలని, కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి 1 లక్షా 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షల రూపాయల లోపు ఉండాలని, దరఖాస్తుదారు ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డ్/ ఆహార భద్రత కార్డు కలిగి ఉండాలని, దరఖాస్తుదారులు ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, మానిటరింగ్ సిస్టమ్ (ఓ.బి.ఎం.ఎం.ఎస్.) వెబ్ పోర్టల్ http://tsobmms.cgg.gov.in, tsmfc.in ఆన్లైన్ ద్వారా ఈ జనవరి 5, 2023 సాయంత్రం 5 గం||ల లోగా దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.