
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో శనివారం జరిగిన ఆరుగురి సజీవ దహనం కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మొదటి నుంచి పోలీసులు అనుమానిస్తున్నదే నిజం అయింది. ఆస్తి వివాదం, అక్రమ సంబంధం, వారసత్వ ఉద్యోగం నేపథ్యంలోనే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. శాంతయ్య భార్య సృజన తన ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు పోలీసులు అనాధికారికంగా ధృవీకరిస్తున్నారు. ఊత్కూర్ కు చెందిన శాంతయ్య శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే-5 గనిలో పని చేస్తూ.. మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో శివయ్య ఇంట్లో అద్దెకు దిగాడు. అక్కడే ఆయన భార్య పద్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు రుజువు అయినట్లు సమాచారం. ఈ క్రమంలో పద్మ మైకంలో పడిపోయిన శాంతయ్య ఇంటికి వెళ్లడం కూడా మానేశాడని.. ఇటీవల తన స్వగ్రామంలో భూమి అమ్మగా వచ్చిన డబ్బులు కూడా ఇవ్వకపోవడంతోనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి శాంతయ్య భార్య సృజన తన ప్రియుడితో కలిసి శివయ్య కుటుంబం తినే ఆహారంలో మత్తు మందు కలిపారని, ఆ మత్తులో వారు నిద్రలోకి జారుకోగానే పెట్రోల్ పోసి ఇంటికి నిప్పు అంటించినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి సమీపంలో ఆరు పెట్రోల్ క్యాన్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు సృజన, ఆమె ప్రియుడితోపాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ. 16 బృందాలను ఏర్పాటు చేసి గంటల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకోవడంతోపాటు కేసును ఓ కొలిక్కి తెచ్చారు.